నిరాకారముగాను, శూన్యముగాను, అంధకారముతోను చెడిపోయిన భూమిని చాలా మంచి దానిగా మార్చుటను గూర్చి ఆదికాండము 1వ అధ్యాయములో చదివెదము. ఆ అధ్యాయము ఆఖరికి వచ్చేసరికల్లా, భూమి మరొకసారి చాలా సుందరమైనదిగా మార్చబడినది. దానిని దేవుడే స్వయముగా చూచి, ''ఇది చాలా మంచిది'' అన్నాడు.
ఆదికాండము ఒకటవ అద్యాయములో మనందరికి ఒక వర్తమానము ఉన్నది. 2వ వచనములో ఉన్నట్లు, సాతాను మానవునిలోనికి వచ్చి అతనిని కూడా నిరాకారముగాను, శూన్యముగాను చేసి మరియు అంధకారము (చీకటి)లోనికి నడిపించాడు. మనము దేవుని స్వరూపమును కోల్పోయాము. దేవుడు ఆదామును ఆయన స్వరూపములో సృష్టించాడు. కాని సాతాను వచ్చి అతనిని నాశనము చేశాడు. అయితే దేవుడు మానవుని మరల నూతనసృష్టిగా చేయుటకు ఆరంభించియున్నాడు.
ఈనాడు నశించిన మానవజాతిని నూతనసృష్టిగా చేయుపనిలో దేవుడు ఉన్నాడు. నీవు ఎంతటి నిరాకారములో ఉన్నప్పటికీ, ఎంతటి అంధకారములో ఉన్నప్పటికీ లేక ఎంతటి శూన్యములో ఉన్నప్పటికీ పరవాలేదు. దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేయగలడని ఆదికాండము 1వ అధ్యాయము చెప్పుచున్నది. ఆయన నిన్ను పరిపూర్ణముగా ఆయన సారూప్యములోనికి మార్చి మరియు ''చాలామంచిది'' అని నీ గురించి ఒక రోజు ఆయన చెప్పును. బైబిలులోని మొదటి అధ్యాయములో ఉన్న వర్తమానము ఇదియే.
కాని ఈ మార్పు ఎలా వచ్చింది? ఇది ఎలా జరిగిందో నీవు అర్థము చేసికొనినచో, అది నీ జీవితములో కూడా జరుగును.
ప్రతిరోజు దేవుడు, ఆయన వాక్యము ద్వారా మాట్లాడెను. రెండవరోజు మాట్లాడాడు. ప్రతి రోజు మాట్లాడెను. బైబిలులోని మొదటి అధ్యాయములో మనము దానిని చూడవలసిన అవసరమున్నది. అదేమనగా మన దేవుడు జీవముగల దేవుడైయున్నాడు మరియు ఆయన మాట్లాడును. నీవు క్రీస్తు సారూప్యములోనికి రూపాంతరము పొందుటకు, దేవుని వాక్యమును వినుట చాలా ముఖ్యమైయున్నది. ''మనుష్యుడు రొట్టెవలన మాత్రమే కాదుగాని దేవుని నోటినుండి వచ్చు ప్రతిమాట వలన జీవించును'' (మత్తయి 4:4). మానవుడు ఆవిధముగా జీవించాలని దేవుడు సంకల్పించియున్నాడు. కాబట్టి మనము ప్రతిరోజు ఆయన స్వరము విననట్లయితే, మనము రూపాంతర (నూతన) పరచబడము.
దేవునియొద్దనుండి వినుటను మనము అలవాటు చేసుకోవాలి. దేవుడు ప్రతిరోజు మాట్లాడును. కాని చాలామంది విశ్వాసులు ఆయననుండి వినరు. ప్రతిరోజు బైబిలు చదివేవారు కూడా కొందరు దేవుని నుండి వినరు. దేవుని నుండి వినటం అంటే కేవలము బైబిలు చదవటము కాదు. కథల పుస్తకము లేక రసాయన శాస్త్రము చదివినట్లు బైబిలు కూడా చదవవచ్చును. అయినప్పటికీ దేవుడు నీ హృదయముతో మాట్లాడాలనుకొనేది నీవు ఎన్నటికి వినకపోవచ్చును.
ఆదికాండము 1:2లో ఇంకొక విషయము చూస్తాము. అది దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. నీవు దేవుని నుండి వినిన తరువాత, పరిశుద్ధాత్మ నీలో పనిచేయుటకు నీవు సహకరించాలి. అప్పుడు మాత్రమే నీవు నూతనపరచబడెదవు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యముతో కలిసి పని చేయుటను మనము ఆరంభమునుండి చూస్తున్నాము. పరిశుద్ధాత్ముడు మాత్రమే మనిషిని రూపాంతరపరచగలడు. దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్ముడు కలిసి పని చేయుట వలన అధ్వాన్నముగా ఉన్న భూమి చాలా మంచిదిగా మార్చబడినది.
క్రైస్తవ్యములో ఈనాడు సమతుల్యత అత్యవసరము. చాలామంది విశ్వాసులు దేవుని వాక్యము చదువుటకు ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడుటను గూర్చి చెప్పరు. పరిశుద్ధాత్మ మీద నీవు ఆధారపడకుండా కేవలము దేవుని వాక్యము ధ్యానించినట్లయితే నీవు ఎముకవలె ఎండినవాడిగా ఉండి మరియు చనిపోయినవాని వలె ఉందువు. కొందరు పరిశుద్ధాత్మ పరిచర్యకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి కేవలము ఉద్రేకముతో ఉండి, అదే పరిశుద్ధాత్మ పరిచర్య అనుకొని మరియు వాక్యమును నిర్లక్ష్యముచేసి పొరబడుచున్నారు. వారు పట్టాలు తప్పిన స్టీము (రైలు) ఇంజను వలె చాలా శబ్దము చేయుచున్నారుగాని దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేసినందున ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుటలేదు.